కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో ఓ ఇంట్లో బంగారు ఆభరణాల చోరీ (Gold Theft) కేసును టౌన్ పోలీసులు త్వరితగతిన ఛేదించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ (DSP Srinivas) కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 6న ఆదర్శనగర్లోని పరంకుశం వెంకటరమణ నివాసంలో పగటి పూట చోరీ జరిగినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం గుత్పాల గ్రామానికి చెందిన దావుల సుమన్ (29) ఈ చోరీ చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. చోరీకి గురైన సుమారు ఏడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, సుమన్ను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన నిర్మల్ టౌన్ సీఐ సమ్మయ్యతో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.

