కలం, వెబ్ డెస్క్: ఏపీలోని కాకినాడ జిల్లా (Kakinada)లో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. అతడి ఆగడాలు తాళలేక చివరికి గ్రామస్తులు చేసిన దాడిలో స్పాట్లోనే మృతి చెందాడు. ఈ ఘటన రౌతులపూడి మండలం ముకులూరు గ్రామంలో జరిగింది. గంగరాజు అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో హల్చల్ చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. తన జీడీ తోటలోని పిక్కలను దొంగలించారంటూ గంగరాజు మద్యం సేవించి కత్తితో వీరంగం (Knife Attack) సృష్టించారు. గ్రామస్థులపై కత్తితో దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రజలు సైతం గంగరాజుపై తిరగబడ్డారు. గ్రామ ప్రజలంతా కలిసి గంగరాజుపై దాడి చేశారు. ఈ క్రమంలో గంగరాజు అక్కడే మృతి చెందాడు. గాయాలైన రమణ, కోటమ్మ, చిన్నబ్బాయి, యర్రబ్బాయ్లను రౌతులపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

