కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖలో కీలక అడుగు ముందుకు పడింది. అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేసేందుకు మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు మందులు, వ్యాక్సిన్ల సరఫరా చేయడానికి డ్రోన్లను (Drone Medicine Delivery ) వినియోగించనుంది.
అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఈ డ్రోన్ మెడిసిన్ డెలివరీ సేవలను నిర్వహించేందుకు ఏపీ ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యచరణను రూపొందించింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం జనవరి నంచి గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు డ్రోన్ల ద్వారా అత్యవసరం మెడికల్ సామాగ్రి, మందులు, వ్యాక్సిన్లు, రక్త యూనిట్లు సప్లయిని అధికారికంగా ప్రారంభించనుంది.
పాడేరు నుంచి 60 – 80 కి.మీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటి హెల్త్ సెంటర్లకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తాయి. మందుల సప్లై మాత్రమే కాకుండా రక్తం, మలం, మూత్ర శాంపిళ్లను పరీక్షల కోసం రవాణా చేస్తాయి. ఈ డ్రోన్లు రెండు కిలోల వరకు బరువును మోయగలుగుతాయి. వీటిలో కోల్డ్ – చైన్ సౌకర్యాలు ఉండడంతో మందులు, వ్యాక్సిన్లు పాడవకుండా ఉంటాయి. Drone Medicine Delivery సేవలతో దూరప్రాంతంలో ఉన్న ప్రజలకు అత్యవసర మెడికల్ అవసరాలు అందుతాయి.


