కలం, వెబ్ డెస్క్ : తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజింగ్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping)తో ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశం పట్ల ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చైనా గడ్డపై ట్రంప్కు ఘనస్వాగతం పలికిన జిన్పింగ్ ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల గురించి చర్చలు జరిపారు. వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచం ప్రస్తుతం వేగవంతమైన మార్పులకు లోనవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ పరిస్థితులు నిలకడలేకుండా అస్థిరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త కూడలికి చేరుకుందని జిన్పింగ్ విశ్లేషించారు. చైనా అమెరికా మధ్య సంబంధాలు సరికొత్త మలుపు తిరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. థుసిడైడ్స్ ట్రాప్ వంటి సవాళ్లను అధిగమించి అగ్రరాజ్యాలు రెండు సరికొత్త ఒరవడిని సృష్టిస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు కేవలం రెండు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారాయి.

