కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar)ను తొలగించే తీర్మానం కోరుతూ లోక్సభ సెక్రటరీకి టీఎంసీ (TMC) నోటీసులు సమర్పించింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ నోటీసులు సమర్పించారు. దీనికి మొత్తం 190 మంది ఎంపీలు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులపై లోక్సభలో 130 మంది ఎంపీలు, రాజ్యసభలో 63 మంది ఎంపీలు సంతకం చేశారని టీఎంసీ వర్గాలు వెల్లడించాయి.
జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) పై టీఎంసీ ప్రధానంగా ఏడు అభియోగాలు మోపింది. సీఈసీ దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియలో ఓట్లను తొలగిస్తున్నారని, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది. పారదర్శకతకు పాతరేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ప్రతిపక్షాలపై వివక్ష చూపిస్తున్నారని, ఎన్నికల్లో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదు చేస్తే దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని ఆరోపిస్తోంది. బెంగాల్ ఎన్నికల సందర్భంగా సీఈసీ ఇటీవల మూడు రోజుల పాటు బెంగాల్ లో పర్యటించారు. ఈ క్రమంలో పలు చోట్ల టీఎంసీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసనలు తెలిపారు.

