కలం, వెబ్ డెస్క్ : ఎండలు మండుతున్నాయి. ఈ కాలంలో శరీరానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదే సమయంలో కిడ్నీలో రాళ్ల (Kidney Stones) సమస్య కూడా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చాలా మంది రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని నమ్ముతుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. వైద్యుల ప్రకారం, నీరు కిడ్నీలో ఉన్న రాళ్లను కరిగించదు. కానీ కొత్త రాళ్లు ఏర్పడకుండా నివారించడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో నీరు తగినంతగా ఉంటే మూత్రం పలుచగా మారుతుంది. దీంతో క్యాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు ఒకచోట చేరి రాళ్లుగా మారే అవకాశాలు తగ్గుతాయి.
అయితే చిన్న పరిమాణంలో ఉన్న రాళ్లు.. ముఖ్యంగా 5 మిల్లీమీటర్లలోపు ఉన్నవి. ఇవి ఎక్కువ నీరు తాగడం ద్వారా సహజంగానే మూత్రంతో బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ 6 నుంచి 7 మిల్లీమీటర్ల కంటే పెద్ద రాళ్లు ఉన్నప్పుడు కేవలం నీళ్లు తాగితే సరిపోదు. అలాంటి సందర్భాల్లో వైద్యుల సలహా తీసుకుని మందులు లేదా ఇతర చికిత్సలు తీసుకోవాలి.
వేసవి కాలంలో కిడ్నీ రాళ్ల (Kidney Stones) సమస్య ఎక్కువగా కనిపించడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్. అధిక వేడి కారణంగా శరీరం త్వరగా నీరు కోల్పోతుంది. దీని వల్ల మూత్రం గట్టిపడుతుంది. అప్పుడు ఖనిజాలు సులభంగా క్రిస్టల్స్గా మారి రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు కనీసం 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగడం అవసరం. రోజుకు సుమారు రెండున్నర లీటర్ల మూత్ర విసర్జన జరిగేలా చూసుకోవాలి. అదేవిధంగా ఉప్పు తగ్గించడం, ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు (పాలకూర, గింజలు) పరిమితంగా తీసుకోవడం, క్యాల్షియం సంతులనం పాటించడం కూడా ముఖ్యమే. ఏదైనా తీవ్రమైన నొప్పి, మూత్రంలో ఇబ్బంది లేదా ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
Read Also: హనీ కాఫీ లెమనేడ్ : ఈ వేసవిలో వైరల్ అవుతున్న రిఫ్రెషింగ్ డ్రింక్!
Follow Us On: Sharechat

