కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లో సా. 4.05 కు గవర్నర్ సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివ కుమార్ తో పాటు 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు ఎంపిక చేసిన సర్వధర్మ మఠాధిపతులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
కాగా, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత గత నెల 30న డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే కేబినెట్ కూర్పుపై మంగళవారం డీకే శివ కుమార్, సిద్ధ రామయ్య ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. అయితే పాత, కొత్త కలయికగా మంత్రివర్గం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. ఒక్కరి కంటే ఎక్కువ మందికి డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కు మంత్రి పదవి రావొచ్చని తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడిగా నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

