కలం, వెబ్ డెస్క్: తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్ రిపోర్ట్ను ఎవరికి వారే తమకు అనుకూలంగా ఆపాదించుకున్నారు. ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకొని తీవ్రమైన వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ప్రస్తుతం ఏకసభ్య కమిషన్ విచారణ ముగిసింది. త్వరలోనే దినేశ్ కుమార్ విచారణకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేయబోతున్నారు.
విచారణ సాగిందిలా..
విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ 2021-2024 మధ్య కాలంలో టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో అవకతవకలు, టెండర్ నిబంధనల సడలింపు, పరిపాలనా వైఫల్యాలపై విచారణ జరిపినట్టు సమాచారం. 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆయన అన్ని కోణాల్లో విచారించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి దినేశ్ కుమార్ పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. దినేశ్ కుమార్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అప్పటి టీటీడీ చైర్మన్లు, అధికారులను ఈ వ్యవహారంలో బాధ్యులను చేయబోతున్నారా? అన్నది నివేదిక బయటకు వస్తే తేలాల్సి ఉంది. ఈ నివేదికతో మరోసారి వైసీపీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశం ఉంది.

