కలం, నిర్మల్: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగుపై ఆందోళన చెందిన రైతులకు ఊరట లభించింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా కురిసిన విస్తార వర్షాలు, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో సారంగాపూర్ మండలం స్వర్ణ జలాశయానికి (Swarna Reservoir) వరద నీరు చేరి జలకళ సంతరించుకుంది. దీంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వర్షాలు లేకపోవడంతో ఈసారి వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచించినప్పటికీ చాలా మంది రైతులు వరి సాగుపైనే మొగ్గు చూపారు. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనులు చేపడుతున్నారు.
రేపు నీటి విడుదల
స్వర్ణ జలాశయం దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1083 అడుగులు కాగా, ప్రస్తుతం 1081 అడుగులకు నీరు చేరింది. దీంతో దిగువన ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జౌళి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ కాలువ కింద సుమారు 8,900 ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి విడుదలతో ఖరీఫ్ పంటల సాగు మరింత వేగం పుంజుకోనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

