కలం, సినిమా : రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘ఎల్లమ్మ’పై (Yellamma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లమ్మ సినిమాను తాను ఎందుకు ఒప్పుకున్నానో వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి పుట్టిన ఊరైన వెదురుపాక గ్రామాన్ని సందర్శించిన దేవిశ్రీ, అక్కడి గ్రామస్థులతో కలిసి జాతర ఉత్సవాలలో పాల్గొన్నారు. పూర్వీకుల ఇంటిని సందర్శిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వెదురుపాక గ్రామ సంస్కృతి, జానపద కళలు, అక్కడి దైవత్వం తనను ‘ఎల్లమ్మ’ సినిమా చేయడానికి ప్రేరేపించాయని తెలిపారు.
“చెన్నైలో ఉన్నప్పటికీ మా తండ్రి తరచూ ఈ ఊరికి తీసుకువచ్చేవారు. ఇక్కడి పచ్చని ప్రకృతి, గ్రామ వాతావరణం నాకు ఎంతో ఇష్టం” అంటూ ఎమోషనల్ అయ్యారు. గ్రామ ప్రజలతో, తమ మూలాలతో ఎప్పటికీ అనుబంధం కొనసాగాలనే ఉద్దేశంతోనే వెదురుపాకలో అందమైన ఇల్లు నిర్మించుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్థులు దేవిశ్రీకి ఘన స్వాగతం పలికారు. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

