కలం, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఖమ్మం (Khammam) జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల అడుగుజాడల్లోనే రాష్ట్ర పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన వృద్ధిపై దృష్టి సారించిందని తెలిపారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్ల స్థాయికి, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల అమలుపై వివరాలు వెల్లడిస్తూ, కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ‘అభయహస్తం’ కింద కొత్తగా 59,448 తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 2.5 లక్షలకుపైగా కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతోందని, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం ద్వారా మహిళలకు భారీ ఆర్థిక లాభం చేకూరిందని వివరించారు.
విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాలలో ప్రభుత్వం విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. సౌర విద్యుత్ ప్రోత్సాహానికి ‘గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025’ అమలు చేస్తుండగా, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణాలు, ఆసుపత్రుల ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఖమ్మం నగర అభివృద్ధిలో భాగంగా మున్నేరు నదిపై తీగల వంతెన, ఖిల్లా వద్ద రోప్వే నిర్మాణం వంటి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రంగాలలో సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

