కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీలో మూడో రోజు వాడివేడిగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పలు ప్రశ్నలు సంధించారు. మూసీ సుందరీకరణ(Musi Beautification) ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీ, ఇండ్ల కూల్చివేత, భూ సేకరణ, ప్రాజెక్టు వ్యయం పెంపు, ప్రభుత్వం చేస్తున్న విభిన్న ప్రకటనలపైన అసెంబ్లీలో ప్రశ్నించారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) కౌంటర్ ఇచ్చారు. మూసీ నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్ట్మెంట్స్ కట్టి పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో ఎంతమంది నివసిస్తున్నారో అంత మందికి పునరావాసం కల్పిస్తామని.. వారికి ఇళ్ల పట్టా ఉందా లేదా అనేది కూడా చూడబోమని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే వారి జీవితాలు బాగుపడొద్దు.. వారు అలాగే మురికి కూపంలో ఉండాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారా? ఈ విషయాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. రేవంత్ హయాంలో తమ ప్రభుత్వం సామాజిక బాధ్యతతో ముందుకు వెళ్తోందన్నారు. మూసీ నిర్వాసిత బిడ్డల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఆ ప్రాంతంలోనే నిర్మిస్తామని చెప్పారు. మెరుగైన ఆసుపత్రులు అక్కడే నిర్మిస్తామన్నారు. మూసీ ప్రక్షాళన ఒక మహా యజ్ఞమని.. ప్రతి చోట ఎస్టీపీలు ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి నీటిని వదులుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ (BRS) నేతల మాదిరిగా తాము ప్రచార ఆర్భాటం చేయమని చెప్పారు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు వివరాలన్నీ వెబ్సైట్లో ఉన్నాయని చెప్పారు. ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చని తెలిపారు. మంచి సలహాలు ఉంటే స్వీకరించి ముందుకు వెళతామని డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti) వివరించారు.
Read Also: మూసీ డీపీఆర్పై వచ్చిన క్లారిటీ.. ఖర్చెంతో తేలింది..!
Follow Us On: Facebook

