కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో ఐవీఎఫ్ చేయించుకున్న భువనగిరి జిల్లాకు చెందిన దంపతులకు బాల భీముడు జన్మించాడని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarasimha) తెలిపారు. సుమారు 4 కిలోల బరువుతో పుట్టిన బాలుడిని చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. భువనగిరి జిల్లాకు చెందిన రవి, సౌమ్య దంపతులకు 9 సంవత్సరాల క్రితం వివాహమైందని.. ఏళ్లుగా సంతానం కలగకపోవడంతో పలు ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్లలో చికిత్స తీసుకున్నారని చెప్పారు. సుమారు 12 సార్లు ఓఐ, ఐయూఐ (IUI) వంటి ప్రొసీజర్లు చేయించుకున్నప్పటికీ ఫలితం దక్కలేదని వారు అవేధన వ్యక్తం చేసినట్లు తెలిపారు. అయితే గతేడాది గాంధీ హాస్పిటల్లోని ఐవీఎఫ్ సెంటర్ను రవి, సౌమ్య దంపతులు ఆశ్రయించారని.. వీరి సమస్యను గుర్తించిన డాక్టర్లు, వీరికి ఐవీఎఫ్ చేశారని పేర్కొన్నారు.
వీరికి ఐవీఎఫ్ తొలి ప్రయత్నంలో ప్రగ్నెన్సీ విజయవంతం అయిందని డాక్టర్లు శోభ, ఫాతిమా చెప్పారని వివరించారు. ఐవీఎఫ్ (IVF Treatment) మొదలు యాంటినాటల్ చెకప్స్, మెడిసిన్ అన్నీ గాంధీలోనే ఉచితంగా అందజేశామని చెప్పారు. ఈ నెల 27న గాంధీ హాస్పిటల్లోనే సౌమ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని.. 3.6 కిలోల బరువుతో బాబు, తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్లు తెలిపారని స్పష్టం చేశారు. సౌమ్య, రవి దంపతులు ప్రైవేటు హాస్పిటల్స్లో లక్షలు ఖర్చు చేసుకున్నారని, గాంధీలో పూర్తి ఉచితంగా వారికి చికిత్స అందించామని సూపరింటెండెంట్, డాక్టర్ వాణి చెప్పారని వివరించారు. పేదల కోసం ప్రభుత్వం ఆసుపత్రుల నిర్మాణం, ఆధునిక పరికరాలు సమకూరుస్తుందని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

