కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా సారపాక నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారిని వెంటనే సీసీ రోడ్డుగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఎం బూర్గంపాడు (Burgampadu) మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ రోడ్డు గుండా నిత్యం పాఠశాల బస్సులు, 18 టైర్ల భారీ వాహనాలు, లారీలు విపరీతంగా తిరుగుతున్నాయని తెలిపారు.
ప్రస్తుత వర్షాలకు రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గుంతలతో, చెరువులను తలపిస్తూ తీవ్ర ప్రమాదకరంగా మారిందని అన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వారు గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుంటున్నా, ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ నెలాఖరుకల్లా సీసీ రోడ్డు నిర్మించాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి రోడ్డు దిగ్బంధం చేస్తామని సీపీఎం హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్.కె. పాషా, వై. అప్పారావు, ఆదురి నరసింహారావు, బత్తుల గోపాలరావు, బోళ్ళ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

