కలం, కరీంనగర్ బ్యూరో: మైనర్ బాలికను వేధించి, అత్యాచారం చేసిన బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ (Bandi Sanjay) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం (Gudikandula Satyam) మాట్లాడుతూ.. బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రగల్బాలు పలికారు కదా? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయి ఉండి నేరారోపణలు ఎదుర్కొంటున్న ఒక కొడుకుని 8 రోజులు దాచిపెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఒక నేరస్తుడిని దాచిపెట్టి, తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసును తప్పుదోవ పట్టించిన బండి సంజయ్ పైన కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, తాను మంత్రిగా ఉంటే కేసును నీరుగార్చి న్యాయ విచారణ జరగకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. బేటి బచావో అని నినాదాలు చేస్తున్న బీజేపీకి బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం కనపడటం లేదా? అని నిలదీశారు. చట్టాన్ని కాపాడి ప్రజలను రక్షించాల్సిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకే మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. బండి భగీరథ్ తప్పు చేయకుంటే 8 రోజులు ఎందుకు పారిపోయాడని, దొరికిన తర్వాత పోక్సో కేసు ఆధారాలు లేకుండా ఫోన్లో సిమ్ ఎందుకు మాయం చేశాడని ప్రశ్నించారు. సామాన్యుడు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆచూకీ తెలపమని విచారించే పోలీసులకు బండి సంజయ్ కూడా ఎనిమిది రోజులు దొరకలేదా? అని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నేరస్తుడికి సహకరించిన బండి సంజయ్ని కూడా నేరస్తుడిగా పరిగణించాలని, తనని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గజ్జల శ్రీకాంత్, రాయికంటి శ్రీనివాస్, నగర కమిటీ సభ్యులు పున్నం రవి, ఆసంపల్లి వినయ్, డబిల్ కార్ శ్రీకాంత్, భూమేష్, అరవింద్, అక్షయ్, రాకేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.

