కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బక్రీద్ పండుగ సందర్భంగా పాలమూరు జిల్లాలో గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీస్శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. గురువారం మిడ్జిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ డీ జానకి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాత్రి వేళల్లో ప్రత్యేక అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రత్యేక నిఘా
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గోవుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని చెక్పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్ జిల్లా మార్గాల్లో వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఎస్పీ మిడ్జిల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు.
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించండి
ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతోపాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రహదారులపై ధాన్యాన్ని ఆరబెట్టరాదని ఎస్పీ రైతులకు సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వలన వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉండటంతో పాటు రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా రైతులు రహదారులను వినియోగించే ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని రోడ్లకు దూరంగా ఉన్న సురక్షిత ప్రదేశాల్లోనే ఆరబెట్టుకోవాలని కోరారు. ఈ సందర్శనలో జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ మహేష్, మిడ్జిల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

