కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ(Telangana) ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ (Budget 2026) పై సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (Nellikanti Satyam) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఆశించిన ప్రయోజనాలు బడ్జెట్లో కనిపించలేదని ఆయన విమర్శించారు. విద్యా రంగానికి కనీసం 20 శాతం కేటాయింపు కావాలని డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం కేవలం 8 శాతం మాత్రమే కేటాయించిందని పేర్కొన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి 4 శాతం మాత్రమే కేటాయించడం ఆందోళనకరమని అన్నారు.
పెన్షన్లు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆ దిశగా చర్యలు కనిపించలేదని ఆయన అన్నారు. ముఖ్యంగా గీత కార్మికులు, యాదవులు, ముదిరాజ్లు, చేనేత కార్మికులు వంటి వృత్తి సంఘాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. కొత్తగా ఇందిరమ్మ బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తున్నారు. అయితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధి విషయంలో ఈ బడ్జెట్ స్పష్టమైన దిశా నిర్దేశం చేయలేకపోయిందని విమర్శించారు.
ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీపై స్పష్టత లేకపోవడం కూడా ఆందోళన కలిగించే అంశమని ఆయన తెలిపారు. బడ్జెట్ కేవలం ప్రసంగాలకు పరిమితం కాకుండా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడేలా ఉండాలి అని సూచించారు. కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించేలా ప్రభుత్వం పారదర్శక చర్యలు తీసుకోవాలి అని నెల్లికంటి సత్యం కోరారు.

