కలం, నిజామాబాద్ బ్యూరో : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ల యుద్ధ దాడులను ఖండిస్తూ వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లోని ధర్నా చౌక్ వద్ద సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా CPI(ML) మాస్ లైన్ నిజామాబాద్ (Nizamabad) అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ సుప్రీం ఖమేని హత్యను ప్రపంచ దేశాలు ఖండించినా, భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ కనీస సంతాప ప్రకటన చేయకపోవడం అమానవీయమని తెలిపారు.
అమెరికా (America) సామ్రాజ్యవాద, యుద్దోన్మాద చర్యలను ప్రజలందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం కోసం అమెరికా చేస్తున్న కుట్రలను ఖండించాలని కోరారు. వెంటనే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల ఆయిల్ నిక్షేపాలపై అధికారం కోసం, తమ ఆయుధ కంపెనీల వ్యాపారం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘర్షణలు సృష్టించి యుద్ధాలు తీసుకొస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, డివిజన్ కార్యదర్శులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం. సుధాకర్, జిల్లా నాయకులు కే.గంగాధర్, బి.మల్లేష్, బీ.మురళి వివిధ ప్రజాసంఘాల నాయకులు సంధ్యారాణి, గణేష్, సాయిబాబా, సాయరెడ్డి, విటల్, సృజన్ చరణ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: చంద్రబాబూ బీకేర్ఫుల్.. మాణిక్కం ఠాకూర్ హెచ్చరిక
Follow Us On: X(Twitter)

