కలం/ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు పట్టణంలోని ఓ పేరున్న కార్పొరేట్ స్కూల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా టీచర్లపై స్కూల్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. నిబంధనల పేరుతో టీచర్లను తరచుగా వీడియోలు తీస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొంత మంది పెళ్లికాని టీచర్లకు అసభ్యకర మెసేజ్ లు పంపి రాక్షసానందం పొందుతున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సదరు ప్రిన్సిపల్ బిహేవియర్ నచ్చక ఎదురు తిరిగితే వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఒక బాధిత టీచర్ ప్రిన్సిపల్ బిహేవియర్ పై ఏకంగా ఫోన్ లో స్టేటస్ పెట్టి బండ బూతులు తిట్టిందంటే సదరు ప్రిన్సిపల్ ఎంత టార్చర్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు అని కొలీగ్స్ మాట్లాడుకుంటున్నారు.
ప్రిన్సిపల్ మహిళా టీచర్లను వేధిస్తే.. మేమేం తక్కువ కాదు అన్నట్టు టెన్త్ ఇంచార్జిగా ఉన్న ఓ ప్రబుద్ధుడు పదో తరగతి బాలికల పట్ల అసభ్యంగా పరవర్తిస్తున్నాడనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. టీచర్లుగా ఉన్నా, విద్యార్థులుగా ఉన్నా మహిళలపై వేధింపులు మాత్రం ఆగట్లేదు. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో మహిళా టీచర్లు, మార్కులు వేయరేమో.. పేరెంట్స్ పరువు పోతుందేమో అనే భయంతో విద్యార్ధినులు సైలెంట్ గా ఉంటున్నట్టు సమాచారం. ఈ ఘటనలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని స్థానికంగా డిమాండ్లు వస్తున్నాయి.

