కలం, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి బంగ్లాదేశ్ అక్రమ వలసలను వాడుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మండిపడ్డారు. ఈ ఓటుబ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల నుంచి అస్సాంను, దేశాన్ని బీజేపీ రక్షిస్తుందన్నారు. ఆదివారం అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ దిబ్రూఘర్లో రూ.10వేల కోట్లతో నిర్మించనున్న బ్రౌన్ఫీల్డ్ అమ్మోనియా–యూరియా ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధాని అన్నారు. పైగా, చొరబాటుదారులు స్థిరపడేలా చేసి ఓటుబ్యాంకును బలోపేతం చేసుకుందన్నారు. వలసల కారణంగా ఇబ్బంది పడుతున్న అస్సాంను, అస్సాం ప్రజలను పట్టించుకోకుండా తమ స్వార్థ రాజకీయాలు కొనసాగించిందని కాంగ్రెస్పై మండిపడ్డారు.
కాంగ్రెస్ చేసిన తప్పును బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ సరిదిద్దుతోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఏళ్ల తరబడి అస్సాంను పాలించినా కనీసం టీ తోటల కార్మికుల భూ సమస్యలను కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ‘బీజేపీ ప్రభుత్వం వచ్చాక టీ తోటల కార్మికులకు భూ హక్కులు కల్పించాం. గౌరవప్రదమైన జీవితం ఇచ్చాం. నేను చాయ్వాలాను. నేను కాకపోతే ఇంకెవరు వాళ్లను ఆదుకుంటారు?’ అని మోదీ అన్నారు. కొత్త ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ భారత ఎరువుల అవసరాలు తీర్చడంలో కీలకమవుతుందని చెప్పారు. ‘2014లో మనదేశం ఎరువుల ఉత్పత్తి సామర్థ్యం 225లక్షల మెట్రికల్ టన్నులు. పదేళ్లలో మేము దాన్ని 306లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాం. కొత్త ఫ్యాక్టరీ అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం అభివృద్ది అవసరమైన ఎరువులను అందించగలదు’ అని మోదీ చెప్పారు. అంతకుముందు ప్రధాని మోదీ గువాహటిలోని స్వహిద్ స్మారక్ క్షేత్రను సందర్శించి, అస్సాం అమరవీరులకు నివాళులర్పించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: ‘జి రామ్ జి’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
Follow Us On: Pinterest


