కలం, వెబ్ డెస్క్: డీ లిమిటేషన్పై కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రతిపాదనలను సంపూర్ణంగా చర్చించి, ఏకాభిప్రాయం సాధించాలని సూచించింది. అప్పటివరకు నియోజకవర్గాల పునర్విభజనకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమి పార్టీలంతా ఒకే అభిప్రాయంతో ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.
ప్రధాని మోదీకి ఖర్గే లేఖ..
సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో డీ లిమిటేషన్ బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం నేపథ్యంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అంశాలపై సమగ్రంగా చర్చ జరపాలని మరోసారి మిమ్మల్ని కోరుతున్నారు. గత మార్చి, ఏప్రిల్ నెలల్లో నేను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి ఇదే అంశంపై లేఖ కూడా రాశాను.
అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించాను. కానీ అలాంటిదేమీ పెట్టలేదు. అందుకే, లోక్ సభలో ఈ బిల్లును అడ్డుకోవాల్సి వచ్చింది. అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజనపై అందరితో చర్చించడమే కాకుండా, ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించేందుకు ప్రతిపక్షాలకు తగినంత సమయం కూడా ఇవ్వండి’ అని ప్రధానిని కోరారు.

