కలం, మహబూబూబ్నగర్ బ్యూరో: ఎల్నినో నేపథ్యంలో వానాకాలానికి సంబంధించి అత్యవసర ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆశించినంత వర్షాలు లేనందున రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, పంటల ఎంపికపై సూచనలు అందించాలని తెలిపారు. వరి సాగుపై మాత్రమే ఆధారపడకుండా తక్కువ నీటితో సాగు చేయగల పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంటల మార్పిడి ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం కలగడంతో పాటు భూసార పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణకు కూడా తోడ్పాటు లభిస్తుందని అన్నారు.
కోయిల్సాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను సమీక్షించిన కలెక్టర్, అందుబాటులో ఉన్న సాగునీటిని దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నీటి కోసం విచక్షణారహితంగా బోర్లు తవ్వడం శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. నీటి వినియోగంలో స్థిరమైన, బాధ్యతాయుతమైన విధానాలు పాటించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు ప్రతి మండలంలో గ్రామసభలు నిర్వహించి రైతులతో నేరుగా చర్చించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జొన్న, సజ్జ, రాగి, ఆముదం, కంది మొక్కజొన్న నల్ల మినుములు, నువ్వులు, ఉలవలు, అలసంద వంటి పంటలు పండించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించిన రైతు సూచనల కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సర్ ను పారదర్శకంగా నిర్వహించాలి
జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా మార్పులపై గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన గడువును పొడిగించిందని తెలిపారు. బీఎల్ఓల ఇంటింటి సర్వే గడువును జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియను కూడా ఆగస్టు 3 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు.
అవసరమైతే సమీప ప్రభుత్వ భవనాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అంశంపై ఈఆర్వోలు, ఏఈఆర్వోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి జిల్లా ఎన్నికల అధికారికి ప్రతిపాదనలు పంపుతారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, ఆర్డీఓ నవీన్, జిల్లా ఎన్నికల డి.టి జాఫర్, ఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

