కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల (Jagtial) జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గురువారం భక్తి శోభతో కళకళలాడింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తమ కుటుంబ ఇలవేల్పుగా భావించే నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న బండి సంజయ్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలు, గోత్రనామాలతో పూజలు నిర్వహించి మంత్రి దంపతులకు ఆశీర్వచనం అందించారు. అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలు, రక్షణను అందజేశారు. ఆలయ నిర్వాహకుల తరఫున బండి సంజయ్ దంపతులను శాలువాతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా ఇచ్చారు.
ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించా: బండి సంజయ్
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి తమ కుటుంబ ఇలవేల్పు అని తెలిపారు. ప్రతి ఏడాది కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. దేశం, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శనంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖుల రాకతో నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి మరింత గుర్తింపు లభిస్తోందని స్థానికులు తెలిపారు.

