కలం, కరీంనగర్ బ్యూరో: సిటీలోని (Karimnagar) పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన సంచలన దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. సోమవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. షోరూం సిబ్బందిని, పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. దుండగుల కాల్పుల్లో సిబ్బంది గాయపడటం బాధాకరమన్నారు. ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే పోలీసులు స్పందించి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మానుకోవాన్నారు. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం సరికాదని హితవు పలికారు. అవసరమైతే బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తామని హామీ ఇచ్చారు.
అనేక రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు..
కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కాంగ్రెస్ సంయమనంతో వ్యవహరించిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. దోషుల వేట కోసం పోలీసు బృందాలు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లాయని, త్వరలోనే దొంగలను పట్టుకొని నగలను రికవరీ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆదిశ్రీనివాస్ వెంట సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, పార్టీ నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కొరివి అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

