కలం, కరీంనగర్ బ్యూరో: బండి సంజయ్కి నైతిక విలువలు ఉంటే కుమారుడిపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. నైతిక విలువలు, మహిళల మీద గౌరవం, సనాతన ధర్మం పట్ల నిబద్ధత కలిగి ఉంటే వాటిని ఆచరించాలని కోరారు. కుమారుడిపై వస్తున్న వార్తలకు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి వెంటనే స్పందించాలని.. విచారణ నిస్పక్షపాతంగా జరిపించాలంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పదవికి దూరంగా ఉండాలి
కుమారుడికి క్లీన్ చిట్ వచ్చి, తన ప్రమేయం లేదని పూర్తిగా ఈరూపణ అయ్యే వరకు మంత్రి పదవికి దూరంగా ఉండాలన్నారు. “ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, పక్షపాతం లేకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి” అని పోలీసులను కోరాలనీ సూచించారు. తన కుమారుడితో మేజిస్ట్రేట్ ముందు సీఆర్ పీసీ 164 ప్రకారం స్టేట్మెంట్ ఇప్పించాలనీ, ఎందుకంటే గతంలో ఇదే అంశంపై మరో కేసులో బండి సంజయ్ 164 స్టేట్మెంట్ గురించి గొప్పగా మాట్లాడారని గుర్తు చేశారు.

