కలం, వెబ్డెస్క్: ప్రముఖ తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ (Anchor Rashmi Gautam) తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలకు ఎక్స్ వేదికగా ఘాటు రిప్లై ఇచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో బీజేపీ మద్దతుదారుగా ఉన్న రష్మి ఎందుకు స్పందించడం లేదంటూ నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. దీనిపై రష్మి స్పందిస్తూ.. బీజేపీకి, మోదీకి మద్దతు ఇస్తా కానీ అత్యాచారాలకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడే వారికి మద్దతు ఇవ్వను అని రష్మీ స్పష్టం చేశారు. తాను అన్ని సమస్యలపై పోరాడలేనని, కేవలం సానుభూతి మాత్రమే చూపగలనని పేర్కొంటూ తనను సోషల్ మీడియాలో వేధించడం ఆపాలని కోరారు.
మనుషులకు సంబంధించిన సమస్యలపై గొంతు ఎత్తడానికి చాలా మంది ఉన్నారని, అందుకే తాను మూగజీవాల కోసం నిరంతరం శ్రమిస్తున్నానని రష్మి వివరించారు. సోషల్ మీడియాలో తనను విమర్శించడానికి వెచ్చించే శక్తిని, సంబంధిత ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ నుంచి న్యాయం కోరడానికి ఉపయోగించాలని ఆమె నెటిజన్లకు సూచించారు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు నటులను ట్యాగ్ చేయడం ఒక ఫ్యాషన్గా మారిందని, కానీ దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. తన పోస్ట్ వల్ల పెద్ద మార్పు ఏమీ రాదని, బాధ్యులైన వారిని ప్రశ్నించడమే సరైన మార్గమని ఆమె హితవు పలికారు.

