కలం, మెదక్ బ్యూరో : మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) కి ప్రజాప్రతినిధుల కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. 2018లో నమోదైన కేసును గురువారం విచారించిన ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసులో A1 గా ఉన్న జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాష్ రెడ్డి), A3గా ఉన్న కుసుమ కుమార్ ల కేసులో నేరాలు రుజువు కాలేదని వారిని నిర్దోషుషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
2004లో అమెరికాకు మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) చేశారని, నకిలీ డాక్యుమెంట్లతో పాస్పోర్టులు సంపాదించారనే ఆరోపణలతో జగ్గారెడ్డి, కుసుమ కుమార్లపై కేసు నమోదైంది. 2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య, కుమార్తె, కుమారుడి పేర్లతో నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించి మరో ముగ్గురు వ్యక్తులకు పాస్పోర్టులు తీసుకొచ్చి, వారిని అమెరికాకు తీసుకెళ్లారని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో తన అధికారిక లెటర్ప్యాడ్పై ప్రాంతీయ పాస్పోర్టు అధికారికి లేఖ రాసి సహాయం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని, నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి మూగ్గురిని అమెరికాకు తీసుకెళ్లి డబ్బు సంపాదించారని 2018లో జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయన సుమారు మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు జగ్గారెడ్డి (A1), కుసుమ కుమార్ (A3)లను నిర్దోషులుగా తేల్చి తీర్పు ఇచ్చింది. ఈ కేసులో జగ్గారెడ్డి (Jagga Reddy), కుసుమ కుమార్ తరఫున న్యాయవాది జి.సంతోష్ రెడ్డి వాదించారు.
Read Also: ఒప్పందంపై లేట్ చేయొద్దు.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
Follow Us On : WhatsApp

