కలం, నిజామాబాద్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ. 2500, కల్యాణ లక్ష్మిలో భాగంగా ఇచ్చే తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ (Bheemgal Municipality) ఎన్నికల ప్రచారంలో భాగంగా 4,8,2 వార్డులలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడు నెలకు రూ. 2500 ఇస్తామని మహిళలను నమ్మించారు. ఇప్పుడు 25 నెలలయ్యింది.. ఒక్క రూపాయి రాలేదు. అంటే ఒక్కో మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 62,500 రూపాయలు బాకీ పడ్డట్టే కదా? అవ్వాతాతలకు 4000 పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చారా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చారా? రైతు రుణమాఫీ అందరికీ కాలేదు. రైతుబంధు 15 వేలు ఇస్తామని చెప్పి, పాత 10 వేలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు అంటూ విమర్శించారు.
బీజేపీకి ఓటు వేసినా వృథా
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లు వేస్తె మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసేలా ఈ ఎన్నికల్లో తీర్పు ఉండాలని వేముల (Vemula Prashanth Reddy) పిలుపునిచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే, రేపు ప్రభుత్వానికి భయం పుట్టి మీకిచ్చిన హామీలను అమలు చేస్తారని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తాను చేసిన అభివృద్ధి పనులను చూసి, భీమ్గల్ భవిష్యత్తు కోసం కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ (BRS) పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి అత్యధిక పన్నులు కడుతుంటే కేంద్రం మాత్రం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అని అని విమర్శించారు.
Read Also: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్నేహబంధం: బీజేపీ చీఫ్ రామచందర్ రావు
Follow Us On: Sharechat


