కలం, జోగులాంబ గద్వాల : ఓటరు జాబితాను తప్పులు లేకుండా సమగ్రంగా రూపొందించేందుకు చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) అన్నారు. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా ఈనెల 25 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అన్ని మండలాల తహసిల్దార్లు, బిఎల్ఓ లు, ఇతర అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ల వారీగా సంబంధిత బిఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయాలన్నారు.
ఎన్నికల సంఘం నిర్దేశించిన అంశాలన్నింటినీ ఓటర్లు ఫారాలలో పూరించేలా అవగాహన కలిగించాలన్నారు. ఈ విషయంలో బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారం కూడా తీసుకోవచ్చన్నారు. బిఎల్ఓ లు ప్రతిరోజు ఎన్ని ఇండ్లు తిరుగుతున్నారు.. ఓటర్ల నుంచి ఫిల్ చేసిన ఫారాలు ఎన్ని తిరిగి వచ్చాయనే సమగ్ర డేటాను ఎప్పటికప్పుడు సంబంధిత యాప్ లో నమోదు చేయాలన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ అధికారులు ప్రతిరోజు రివ్యూ నిర్వహించనున్నట్లు చెప్పారు. బిఎల్ఓ లకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత తహసీల్దారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చన్నారు. ఎవరైనా ఓటర్లు నిర్దేశిత వెబ్సైట్లో స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు. 2002 ఓటర్ లిస్టును ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుతం ఎలాంటి తప్పులు లేని సమగ్ర ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారి మంజుల, వివిధ మండలాల తహసిల్దార్లు, సూపర్వైజర్లు, బిఎల్ఓ లు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్
Follow Us On: Instagram

