కలం, మెదక్ బ్యూరో: విద్యా రంగంలో మెదక్ (Medak) జిల్లా అగ్ర స్థానంలో ఉండాలని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ పాఠశాలలు మారాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ (Collector Pratima Singh) ఆకాంక్షించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 100 శాతం ఉత్తీర్ణత సాధించిన 91 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, 560 ఆ పై మార్కులు పొందిన విద్యార్థులకు కలెక్టర్ మంగళవారం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎగ్జిక్యూటివ్ ఫైల్, డిక్షనరీలు కూడా అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని సూచించారు. సమాజంలో వ్యక్తిని ఉన్నత స్థాయిలో నిలపాలంటే విద్య ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీల్లో స్థానాన్ని పొందడానికి, ఎయిమ్స్ లాంటి ఉత్తమమైన వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి విద్యార్థులు ప్రయత్నించాలని సూచించారు.

