కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొండాపూర్ మండలంలోని అలియాబాద్, కంది గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ (Collector Prateek Jain), ఎస్పీ పరితోశ్ పంకజ్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని అక్రమంగా తెలంగాణలో విక్రయించకుండా చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించడంతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. అవసరాన్ని బట్టి రవాణా వాహనాలు అందుబాటులో ఉండేలా, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.

