కలం, మెదక్ బ్యూరో: రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ (Prateek Jain) స్పష్టం చేశారు. జోగిపేట మార్కెట్ యార్డుతో పాటు చౌటుకూరు మండలం కొర్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. హమాలీలు, లారీలు, టార్పాలిన్ కవర్లు, గోనె సంచుల లభ్యత, ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ షీట్ల జనరేషన్, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు, రైతుల ఖాతాల్లో జమ చేసిన చెల్లింపుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

