కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శుక్రవారం నగర పాలక సంస్థ (KMC) ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఈ మేరకు బాధ్యతలను స్వీకరిస్తూ సంతకం చేశారు. కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియడంతో, ప్రభుత్వం కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధి, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అలాగే వేసవి కాలం, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు. నగరవాసులకు తాగునీటి ఎద్దడి కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

