కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ లో బాగంగా ఈ నెల 18 నుండి 23వ తేదీ వరకు పర్యాటక వారోత్సవాలు, క్రీడా యువజన వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోక్రీడా, యువజన వారోత్సవాలు, పర్యాటక వారోత్సవాల పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతాభావం, యువశక్తి వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
ఆరు రోజుల పాటు జరిగే ఈ “యువజన క్రీడల” థీమ్ కార్యక్రమాలు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో యువజన సంఘాలు, క్రీడాకారులు, విద్యార్థులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించబడతాయని ఆమె (Khushboo Gupta) తెలిపారు. సోమవారం 18న “ఫిట్ యాక్టివ్ తెలంగాణ” కార్యక్రమంతో వారోత్సవాలు ప్రారంభం అయ్యాయనీ, ఇందులో స్టేడియం గ్రౌండ్ నుండి జిల్లా స్థాయి వరకు ఐదు కిలోమీటర్ల మారథాన్లు, యోగా, ధ్యానం, ఏరోబిక్స్ కార్యక్రమాలు, అన్ని మండల కేంద్రాలలో 2కె వాక్థాన్లు, యోగ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు.
మే 19న “కెరీర్, స్కిల్ డెవలప్మెంట్ డే” సందర్భంగా నైపుణ్యాభివృద్ధి కోర్సులు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అవకాశాలు, స్కిల్ యూనివర్సిటీ కార్యక్రమాలు, అగ్నివీర్ నియామకాలపై యువతకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో వర్చువల్ సెషన్లు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
మే 20న యువతలో నాయకత్వ లక్షణాలు, వినూత్న ఆలోచనలు, పౌర అవగాహన పెంపొందించేందుకు “యూత్ లీడర్షిప్ సమ్మిత్” కార్యక్రమం నిర్వహించబడతాయన్నారు. అలాగే సామాజిక, అభివృద్ధి అంశాలపై యూత్ పార్లమెంట్ సమావేశాలు, చిత్రలేఖన పోటీలు విద్యాసంస్థలు, యువజన సంఘాల భాగస్వామ్యంతో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు స్టేడియం గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
మే 21ను “ప్లే పార్టిసిపేట్ – స్పోర్ట్స్ డే”గా నిర్వహిస్తూ, జిల్లా యువజన, క్రీడల అధికారుల కోచెస్, స్టాఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్టేడియంలో అథ్లెటిక్స్, బాడ్మింటన్, కబడ్డీ, బాస్కెట్ బాల్, వాలీబాల్, ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, క్రీడల పోటీలు ఉదయం 7 గంటల నుండి నిర్వహించనున్నట్లు తెలిపారు.
మే 22న “సర్వ్ సపోర్ట్ – క్లీన్ తెలంగాణ స్వచ్ఛ క్రీడాల మైదానలా కోసం యువత” కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో యువ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మైదానాలు, పార్కులు, చెరువులు, ఖాళీ ప్రదేశాలు, సామాజిక ప్రదేశాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపడతారు.
మే 23న చివరి రోజు “ఉద్యోగ సాధన – అవకాశాలతో ప్రతిభను అనుసంధానం” కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ఇందులో భాగంగా ఇటివల మే 1వ తేదిన నిర్వహించిన జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆఫరింగ్ /అపాయింట్ మెంట్ లెటర్స్ /ఆర్డర్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సీఎం కప్ -2025 లో గెలుపొందిన వారికి మెడల్స్, క్రీడా వారోత్సవాలలో భాగంగా మే 21 న జరిగిన క్రీడా పోటి విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి, జిల్లా పర్యాటక అధికారి జె.రాజ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామానుజుల రెడ్డి, డీపీఆర్ఓ పి.శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Also: రోడ్లపై నమాజ్.. యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు
Follow Us On: WhatsApp

