కలం, నిజామాబాద్ బ్యూరో: జన గణనలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) బుధవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంగస్థాన్ ఫేజ్ -1 లో పద్మజ అనే మహిళ ఇంటిని సందర్శించి, హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ నిశితంగా పరిశీలన జరిపారు. ఎన్యూమరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిని భారతికి సంబంధించిన గుర్తింపు కార్డును తనిఖీ చేశారు. జన గణన కోసం వెళ్లే సందర్భంలో ప్రతి ఎన్యూమరేటర్ క్యూ.ఆర్ కోడ్ తో జారీ చేయబడిన ఐ.డీ కార్డును తప్పనిసరిగా ధరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంటి యజమానులు, కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే తమ ఇళ్లకు జన గణన కోసం వచ్చే ఎన్యూమరేటర్ ఐ.డీ కార్డును పరిశీలించిన తరువాతే అనుమతించాలని కలెక్టర్ సూచించారు.
వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో జన గణన ప్రక్రియను పొరపాట్లకు తావు లేకుండా వేగంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు సూచించారు. సెన్సస్ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా జన గణన జరపాలని అన్నారు. సమయ పాలన పాటిస్తూ, ఇంటింటి సందర్శన సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నగర పాలక సంస్థ ఈ.ఈ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు ఉన్నారు.

