స్వీయ గణనలో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: స్వీయ గణనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పిలుపునిచ్చారు. జన గణన ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ (Nizamabad) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం కలెక్టరేట్‌లోని తన క్యాంపు కార్యాలయంలో స్వీయ నమోదు చేసుకున్నారు. జన గణనలో ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ వెబ్ సైట్ https://se.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జన గణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన (Digital Self-Enumeration) విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్‌లో కానీ, మొబైల్ యాప్ ద్వారా గానీ స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు. జన గణనకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని అన్నారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి (SEID) జారీ చేయబడుతుందని తెలిపారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్డ్ ఎన్యుమరేటర్లు మే 11 నుంచి జూన్ 9వ తేదీ మధ్యకాలంలో క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ నెంబర్ తెలియజేయాలని సూచించారు.

జన గణనకు సహకరించాలి : కలెక్టర్

ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే, ధృవీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధృవీకరిస్తారని తెలిపారు. అయితే, స్వీయ గణనలో ఖచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలని, వీటి ఆధారంగానే ఎన్యూమరేటర్లను నియమిస్తారని తెలిపారు. జనగణన ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమగ్రతను పెంచడం, ప్రతి పౌరుడి వివరాలు జన గణనలో చేరేలా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ, సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడే జన గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, జిల్లాలో ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>