కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఖానాపూర్లోని రైస్ మిల్లులను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లక్ష్మీ బాలాజీ రైస్ మిల్లుతో పాటు శ్రీ సిద్ధి రామేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ మిల్లులను ఆమె పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ఎన్ని లారీల ధాన్యం వచ్చిందీ, ఎంత మిల్లింగ్ జరిగింది, బియ్యం నిల్వలను ఎలా భద్రపరుస్తున్నారన్న విషయాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లుల వద్ద తరుగు తీస్తున్నారా అనే అంశంపై కూడా ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. నిల్వలను సమయానికి దించుకోకపోతే వర్షాల కారణంగా తడిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని, ధాన్యం నిల్వలు, బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. నిల్వ కోసం సమీప రైతు వేదికలను వినియోగించుకోవాలని తెలిపారు. జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలలో డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, మిల్లుల నిర్వాహకులు వి. మోహన్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

