కలం, వరంగల్ బ్యూరో: పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai) హెచ్చరించారు. బుధవారం ఆమె నగరంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ పరిస్థితులను పరిశీలించారు. మొదటగా గోపాలపూర్ ఊర చెరువు వద్ద ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించిన కలెక్టర్, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఊర చెరువు డీసిల్టేషన్ టెండర్లు పూర్తయిన నేపథ్యంలో వెంటనే పనులు ప్రారంభించి, వర్షాకాలానికి ముందే చెరువును పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని సూచించారు.
అనంతరం 56వ డివిజన్లోని గోపాలపూర్ ఊర చెరువు సమీపంలో “వేస్ట్ టు ఆర్ట్” (Waste to Art) కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. చెత్త రహితంగా, సుందరీకరణతో రూపొందించిన ప్రాంతాల నిర్వహణను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. 53వ డివిజన్ ఆదర్శ్ నగర్లో విండో కంపోస్టింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, బాలసముద్రంలోని వెహికిల్ షెడ్, సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్లను తనిఖీ చేశారు. డోర్ టు డోర్ చెత్త సేకరణలో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం సరిగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటి వద్ద తడి–పొడి చెత్తను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత జవాన్లు, ఇన్స్పెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలసముద్రంలోని వర్మీ కంపోస్టింగ్ యూనిట్, విండో కంపోస్ట్, బయో కంపోస్ట్ యూనిట్లను పరిశీలించిన కలెక్టర్ (Collector Chahat Bajpai), బయో కంపోస్ట్ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బయో మీథనైజేషన్ ప్లాంట్ను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ తనిఖీలలో సీఎంఓహెచ్ డాక్టర్ రాజారెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి కిరణ్ కుమార్, డీఈ హర్షవర్ధన్, సూపర్వైజర్ నరేందర్, ఎస్సై భాషా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: అశ్వాపురంలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వివాదం!
Follow Us On: X(Twitter)

