కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం (Dummugudem Road Accident) మండలంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చిన్న బండి రేవు ప్రధాన రహదారిపై బైక్, ట్రాక్టర్ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భద్రాచలం వైపు నుంచి వస్తున్న బైక్ను, పర్ణశాల వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రత బలంగా ఉండటంతో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను చుంచు చరణ్ సాయి, సంతోష్ గా స్థానికులు గుర్తించారు. మృతుల్లో ఒకరైన సంతోష్ చర్ల మండలం గోంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే దుమ్ముగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఎదురెదురుగా వస్తున్న వాహనాల వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

