కలం, వరంగల్ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ (Hanamkonda) కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు. గురువారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు (Housing Beneficiaries) నిర్మాణ దశల ప్రకారం.. ప్రతివారం బిల్లులు సమయానికి చెల్లిస్తున్నామని చెప్పారు. ఎక్కడా బిల్లులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి, ఇందిరానగర్, గుంటూరుపల్లి గ్రామాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వంద శాతం ప్రగతి సాధించాయని అభినందించారు. మిగతా గ్రామాలు కూడా అదేవిధంగా ముందుకు సాగాలని సూచించారు.
బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుకినే సంతాజీ, సర్పంచ్ లావణ్య, జడ్పీ సీఈవో శేషాద్రి, డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, డీపీవో లక్ష్మీ రమాకాంత్, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, డీఈవో గిరిరాజ్ గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, ఏడీఏ ఆదిరెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, తహసీల్దార్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.
Read Also: షాకింగ్.. భారీగా పెరిగిన సబ్బుల ధరలు
Follow Us On: X(Twitter)

