కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెం (Kothagudem) పట్టణంలోని ఎంఈఓకు జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారం పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస విద్యాలయం, పట్టణ బాలుర ఆవాస విద్యాలయాలను కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏడవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజనం, ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల ఇంగ్లీష్ పఠన సామర్థ్యాన్ని పరీక్షించి విద్యార్థుల ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు సరిగ్గా చదవలేకపోవడానికి గల కారణాలపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించిన కలెక్టర్, బోధనలో లోపాలు ఎందుకు ఉన్నాయో వివరణ కోరారు. పట్టణ స్థాయి పాఠశాల అయినప్పటికీ విద్యార్థుల సామర్థ్యం తక్కువగా ఉండటం ఆందోళనకరమన్నారు.
అనంతరం స్టోర్రూమ్ను పరిశీలించిన కలెక్టర్, అవసరమైన సరుకులు తగినంతగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరఫరాలో లోపాలు ఎందుకు ఉన్నాయో సంబంధిత అధికారులను ప్రశ్నించారు. తదుపరి కిచెన్ను పరిశీలించి పరిశుభ్రత లోపాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోనని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఎంఈఓ (MEO)కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులకు కలెక్టర్ (Collector Ankit) ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల నిర్వహణ, బోధన ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ రాంబాయి, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read Also: అందుకే 100 యంగ్ ఇండియా స్కూళ్లకు శ్రీకారం చుట్టాం: భట్టి
Follow Us On : WhatsApp

