కలం, వెబ్ డెస్క్ : తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి సొంత ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ ఇప్పుడు ‘మావిగన్’ అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే జగన్ ప్రస్తుతం ‘మావిగన్ జోకర్’గా మారారని సెటైర్ వేశారు. దివంగత వైఎస్సార్ చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తి అయిన వేళ ఆమె ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జగన్ కేవలం వైఎస్సార్ పేరును రాజకీయంగా వాడుకుంటున్నారని , కానీ ఆయన ఆశయాలకు వారసుడు కాలేదని షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్సీపీలో నిజంగా వైఎస్సార్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం అయ్యి కూడా ఆయన కలల ప్రాజెక్ట్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో రాష్ట్రం నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుంటే జగన్ అడ్డుకోలేదని చెప్పారు. వైఎస్సార్ లైన్ వాడుకోని అధికారంలోకి రావడమే తప్ప పాలనలో వైఎస్సార్ మార్క్ కపించలేదని పేర్కొన్నారు. ఏపీలో వైఎస్సార్ ఆశయసాధన కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.
జగన్ అధికారం కోసం బీజేపీ దత్తపుత్రుడిలా మారిపోయారని షర్మిల ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ, క్రైస్తవులపై దాడులు జరిగిన జగన్ మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఇప్పుడు కూడా వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నా.. ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించడం లేదని ఫైర్ అయ్యారు. వచ్చే ఏడాది జగన్ చేయనున్న పాదయాత్రపై షర్మిల (YS Sharmila) స్పందిస్తూ.. ఆయన చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మవిమర్శ యాత్ర అని సూచించారు.
Read Also: ద్వారకా తిరుమలలో ’చున్నీ’ రగడ.. మహిళా గార్డుపై దాడి!
Follow Us On: X(Twitter)

