కలం, వెబ్డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ఆధ్వర్యంలో నిర్వహించిన చలో పార్లమెంట్పై పోలీసులు, భద్రతా దళాలు లాఠీ ఝులిపించారు. మరికొద్ది సేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజీలను నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నేడు చలో పార్లమెంట్కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తూ ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడవద్దని ఆదేశించారు.
పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున జంతర్మంతర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే భారీగా మోహరించిన భద్రతా దళాలు లాఠీలతో కాక్రోచ్ పార్టీ మద్దతుదారులపై విరుచుకుపడ్డారు. దీంతో వారు రోడ్డుపై పరుగందుకున్నారు. కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అడ్డుకున్నా, లాఠీచార్జ్ చేసినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీల వివాదం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు సీజేపీ చేపట్టిన చలో పార్లమెంట్కు అనుమతి లేదని, ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

