కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లాలో హైదరాబాద్-1 డిపో బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది.. హైదరాబాద్ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు (TG 35Z 0030) జుక్కల్ చౌరస్తా సమీపంలో ప్రమాదానికి గురైంది (Kamareddy Bus Accident). అతివేగంగా వెళ్తుండటంతో వాహనం ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను అత్యవసర చికిత్స నిమిత్తం బిచ్కుంద ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

