కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) తాను హీరోగా నటించిన చివరి సినిమా జన నాయగన్ (Jana Nayagan) నిర్మాతకు బంపరాఫర్ ఇచ్చారు. నిర్మాత వెంకట నారాయణ (Venkata Narayana)ను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమిళనాడు ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతకే పదవి ఇవ్వడంపై తమిళనాడు, సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిక చర్చ నడుస్తోంది.
వెంకట నారాయణ బెంగళూరు కేంద్రంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. ఇటీవల జననాయగన్ సినిమా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అవ్వడం, ఆపై సర్టిఫికేషన్ ఆలస్యం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో కొందరు నెటిజన్లు ఈ నియామకానికి, సినిమాకు ఏదైనా లింక్ ఉందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతను ఆదుకోవడానికే విజయ్ ఈ పదవి ఇచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. బెంగళూరులో స్థిరపడ్డ వ్యక్తిని తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎలా నియమిస్తారంటూ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

