కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో నిర్వహించిన చిట్చాట్లో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్పై సీఎం రేవంత్ (CM Revanth) తీవ్ర విమర్శలు గుప్పించారు. సీనియర్లకు అవమానం జరిగిందని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆలె నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్ వంటి అనేక మంది నాయకులకు బీఆర్ఎస్లో జరిగిన పరిణామాలను గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడిన సీనియర్లను పక్కన పెట్టడం సరైన విధానం కాదన్నారు. మెరిట్, డిసబిలిటీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరగాలని సూచించారు. బీజేపీ తీసుకొస్తున్న ప్రతిపాదనల్లో రాజకీయ స్వార్థం దాగి ఉందని ఆరోపించారు. వివక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేస్తూ, సరైన చర్చ లేకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల్లోనే 181 సీట్లు మహిళలకు కేటాయించవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణలో ఐదు నెలల్లోనే జనగణనతో పాటు కుల గణన పూర్తి చేసినట్లు వివరించారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలను కూడా ఇలాగే తొందరపడి తీసుకొచ్చి, రైతుల ఆందోళనలతో వెనక్కి తీసుకున్నవిషయం తెలిసిందేనని అన్నారు. నియోజకవర్గాల పెంపుపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ప్రతిస్పందన వస్తే, చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే కేంద్రం ఏం చేస్తుందోనని ప్రశ్నించారు. అవసరమైతే బిల్లు అడ్డుకునేందుకు పోరాటం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ కేంద్రానికి ఒక రూపాయి ఇస్తే కేవలం 42 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా, రాజకీయంగా రెండో తరగతి పౌరుల్లా చూడబడుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

