కలం, వెబ్ డెస్క్: నీట్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆల్ ది బెస్ట్ చెప్పారు. రేపు జరగబోయే నీట్ రీ-టెస్ట్ను ప్రశాంతంగా, ఒత్తిడి, ఆందోళనలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. ఎంతో కష్టపడి, అంకితభావంతో సిద్ధమయ్యారని.. నీట్ పరీక్ష వైద్య విద్యకు ప్రవేశ ద్వారం కావడంతో, సన్నద్ధతపై నమ్మకం ఉంచుకుని ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు. రాష్ట్రంలో 208 పరీక్షా కేంద్రాల్లో 2.95 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నట్లు వివరించారు. వారి సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రశాంతంగా, ఏకాగ్రతతో పరీక్ష రాస్తే కష్టం ఫలిస్తుందని, భవిష్యత్తులో లక్ష్యాలను సాధిస్తారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

