కలం, వెబ్ డెస్క్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఇటీవలే దీనిపై ఇంజినీర్లతో సుదీర్ఘ సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఈ నెల 7వ తేదీన ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టిన కుమురం భీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామానికి వెళ్లబోతున్నారు. ప్రాణహిత నదిని పరిశీలించి, ఉన్నతాధికారులతో చర్చించబోతున్నారు. అనంతరం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ మేరకు సభా స్థలి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్సీ దండే విఠల్ పరిశీలించారు.
మళ్లీ తెరపైకి కీలక ప్రాజెక్ట్..
ఉమ్మడి ఏపీలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. కేసీఆర్ ఈ ప్రాజెక్టును రద్దు చేసి దీని స్థానంలోనే కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభించి.. దాదాపు అన్ని పనులు పూర్తి చేశారు. ఇందుకోసం రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు కావడం, మేడిగడ్డలో పిల్లర్లు కుంగడం, పైగా అనుకున్నంత మేర సాగులోకి రాకపోవడంతో, సీఎం రేవంత్ రెడ్డి ప్రాణహిత ప్రాజెక్టును మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ మేరకు తుమ్మడిహెట్టిలో పర్యటించబోతుండటం ఆసక్తికరంగా మారింది.

