కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోమారు ఢిల్లీ బాట (Revanth Delhi Visit) పడుతున్నారు. ఈ నెల 16న వెళ్లేలా షెడ్యూలు దాదాపుగా ఖరారైంది. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో పాటు స్పోర్ట్స్ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నిమిత్తం వారం రోజుల్లో మరోసారి ఢిల్లీ వచ్చి ఏఐసీసీ నేతలతో భేటీ కావచ్చని గతంలోనే కాంగ్రెస్ కేంద్ర వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఈ నెల 16న ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తున్నందున అదే సమయంలో ఏఐసీసీ నేతలతోనూ సుదీర్ఘంగా సమావేశమయ్యే అవకాశమున్నది. కేరళ సీఎం ఎంపిక ప్రక్రియ ముగిసినందున తెలంగాణ అంశాలపై ఏఐసీసీ ఫోకస్ పెట్టడానికి వెసులుబాటు లభించింది. ఒకవైపు పరిపాలనా వ్యవహారాలు, మరోవైపు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
రాష్ట్ర మంత్రివర్గంలో రెండు ఖాళీ బెర్తులను భర్తీ చేయడంతో పాటు కొంతమంది మంత్రుల శాఖలను కూడా మార్చడంపై కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ఎస్టీ (లంబాడా) సామాజికవర్గానికి చెందినవారికి మంత్రివర్గంలో తప్పకుండా స్థానం ఉంటుందని ఇటు పీసీసీ, అటు ఏఐసీసీ వర్గాలు గతంలోనే దాదాపుగా ఖరారు చేశాయి.

