కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆయన ప్రతిభను గుర్తించిన ఏఐసీసీ అగ్ర నాయకత్వం కేరళ (Kerala) ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించింది. హోదాకు తగ్గట్టుగా సీఎం రేవంత్ కూడా ఇటీవల కేరళలో పర్యటించి యూడీఎఫ్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ప్రధానంగా కేరళ సీఎం పినరయి విజయన్ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. రేవంత్ పర్యటనతో యూడీఎఫ్కు మంచి మైలేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన కేరళలో పర్యటించబోతున్నారు.
రేపు త్రివేండ్రం కేంద్రంగా యూడీఎఫ్ (UDF) అభ్యర్థుల విజయార్థం నిర్వహించనున్న భారీ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇప్పటికే కేరళలో పలు చోట్ల పర్యటించిన రేవంత్ అధికార ఎల్డీఎఫ్ (LDF), బీజేపీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రధాన పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తనదైన స్టైల్లో ప్రచారం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

